రాముడి జీవితం ఉట్టిపడేలా.. అయోధ్యలో 100 దేవతా విగ్రహాలతో శోభాయాత్ర

-

అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అయోధ్య రామమందిర ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దేశవిదేశాల ప్రముఖులకు ఆహ్వానాలను పంపింది. ఇక ఈ మహోత్సవాల సందర్భంగా శ్రీరాముని జీవితంలోని కీలక ఘట్టాలను తెలిపే విధంగా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. సుమారు 100 విగ్రహాలతో అయోధ్యలో ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి గుర్తుగా జనవరి 17 శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వారం రోజులపాటు జరిగే రామ్​లల్లా విగ్రహా ప్రతిష్ఠాపనా మహోత్సవాలను ఈ శోభాయాత్రతోనే శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. శ్రీరాముని జననం నుంచి వనవాసం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి కీలక ఘట్టాలు తెలిపే విధంగా విగ్రహాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్​ తెలిపారు. విగ్రహాలను తయారు చేసే అవకాశం తనకు లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వివిధ దశల్లో మొత్తం 100 విగ్రహాలను ప్రదర్శిస్తారని.. వీటిలో ఇప్పటి వరకు 60 విగ్రహాలు సిద్ధం చేశామని రంజిత్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version