రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు.. బెంగాల్‌ గవర్నర్‌ సంచలన కామెంట్స్

-

పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం వివాదం నడుస్తోంది. రోజురోజుకు ఈ వివాదం రాజుకుంటోంది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్‌కతా పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో ప్రస్తుతమున్న కోల్‌కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని ఆరోపించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇన్‌ఛార్జి అధికారి, ఆయన బృందం వల్ల తన వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందని అన్నారు. దానికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం మమతాబెనర్జీకి సమాచారం ఇచ్చానని.. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని ఆందోళన వ్యక్తంచేశారు.

తన అధికారిక నివాసంలో ఉన్న పోలీసు సిబ్బంది తనపై నిఘా ఉంచారంటూ ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బయటి వ్యక్తుల ప్రభావం వల్ల వారు అలా చేస్తున్నారని గవర్నర్ భావిస్తున్నారని తెలిపాయి. మరోవైపు రెండు రోజుల క్రితం రాజ్‌భవన్‌ పోలీసులపై గవర్నర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వారు తక్షణమే అధికారిక నివాస పరిసరాలను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version