ఇంకా మేల్కోని ల్యాండర్, రోవర్.. ఇక ఆశలు వదులుకోవాల్సిందేనా..?

-

ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగ్విజయంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయిన విషయం తెలిసిందే. చంద్రయాన్-3లోని విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు ఇంకా నిద్రాణస్థితి నుంచి తిరిగి బయటికు రాలేదు. జాబిల్లిపై పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని పంపిన విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లను.. చంద్రునిపై రాత్రివేళ ఉండే అతిశీతల పరిస్థితుల దృష్ట్యా.. ఈనెల 2, 4వ తేదీల్లో ఇస్రో నిద్రాణస్థితిలోకి పంపింది.

చంద్రుడిపై పగలు మొదలుకావడంతో సూర్యరశ్మి గ్రహించి బ్యాటరీలు రీఛార్జ్‌ అయితే.. క్రియాశీలం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇస్రో కూడా ల్యాండర్‌, రోవర్‌ నుంచి కమ్యూనికేషన్‌ పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ల్యాండర్‌, రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి.

ఈ నెల 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కావడంతో శాస్త్రవేత్తలు వాటితో అనుసంధానమయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి సిగ్నల్స్‌ లేవు. ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. మిషన్‌లో ఉపయోగించిన పరికరాలు అక్కడి అతిశీతల పరిస్థితులను తట్టుకోలేకపోయాయని చెప్పారు. ల్యాండర్‌, రోవర్‌లతో ఇక అనుసంధానం కాలేకపోయినప్పటికీ ఈ మిషన్‌ ఓ అఖండ విజయమని ఇస్రో మాజీ అధిపతి ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news