భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతీయ యోధులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర ప్రకారమే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భావజాలానికి అస్సలు పొంతనే లేదని తెలిపారు. ఆర్ఎస్ఎస్ను పటేల్ బ్యాన్ కూడా చేయించారని గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ పటేల్ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఖర్గే అన్నారు.
గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ మెమోరియల్లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశంలో ఉన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల చూపును మరల్చేందుకే మతపరమైన అంశాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్లు లేవనెత్తుతున్నాయని ఆరోపించారు. స్వాతంత్య్ర యోధులపై వీళ్లు తప్పుడు ప్రచారానికి తెగబడ్డారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వైఖరి చాలా హాస్యాస్పదంగా ఉందంటూ చురకలు అంటించారు.