ఈనెల 15కల్లా ఎన్నికల కమిషనర్ల నియామకం!

-

కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేయనున్నారు. న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్‌ కమిటీ తొలుత ఒక్కో పోస్టుకు ఐదుగురి పేర్లతో వేర్వేరు జాబితాలను సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వారిలో నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ ఒక్కొక్కరిని కమిషనర్‌గా ఎంపిక చేస్తారు.

ఎంపికైన వారి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ప్రధాని అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈ నెల 15వ తేదీన సమావేశం కానుంది. గత ఫిబ్రవరిలో ఒక కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా.. శుక్రవారం రోజున అనూహ్యంగా మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు. త్వరలో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను త్వరగా భర్తీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version