మా సర్కార్ ను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర : కేజ్రీవాల్

-

బీజేపీపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. దిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే తమ ఎమ్మెల్యేలకు ఎర వేసిందని కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. ఆమ్ ఆద్మీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలు ముట్ట జెబుతామని, బీజేపీ నుంచి టికెట్లు కూడా ఇస్తామని నచ్చజెబుతూ ఆ పార్టీ ఎర వేసిందని కేజ్రీవాల్ తీవ్రంగా ఆరోపించారు.

అంతేకాక తనను త్వరలోనే అరెస్టు చేయిస్తామనీ తద్వారా ప్రభుత్వాన్ని పడగొడతామని ఎమెల్యేలను బెదిరించారని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. అయితే.. ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఆప్ను వీడేందుకు ఒప్పుకోలేదని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. మొత్తం 21 మంది ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపిందని తెలిపారు.

మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించిన బీజేపీ తాము రూ.25 కోట్లు ఇస్తామన్న ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలని ఆమ్ ఆద్మీ పార్టీకి సవాల్ విసిరింది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడింది.

Read more RELATED
Recommended to you

Latest news