భారత్‌లో ఉన్నతోద్యోగులను తొలగించిన మెటా

-

ఐటీ కంపెనీల్లో ఇంకా లే ఆఫ్స్ భారీగా కొనసాగుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా మరో 6,000 మందిని ఇంటికి పంపిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా 10వేల మంది ఉద్యోగులను తీసివేయనున్నట్లు మార్చిలో సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

వీటిని ఏప్రిల్‌, మేలో రెండు విడతలుగా చేపడతామని వెల్లడించింది. అందుకనుగుణంగానే ఏప్రిల్‌లో నాలుగు వేల మందిని ఇంటికి పంపింది. మిగిలిన ఆరు వేల మందిని తాజాగా తొలగించింది. మార్కెటింగ్‌, సైట్‌ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్‌ ఇంజినీరింగ్‌, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ సహా చాలా విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నాయి.

తొలగింపుల్లో భాగంగా భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులనూ మెటా ఇంటికి పంపింది. పింక్‌ స్లిప్స్‌ అందుకున్న వారిలో భారత్‌లో పలువురు ఉన్నతోద్యోగులు ఉన్నట్లు సమాచారం. మార్కెటింగ్‌ విభాగం డైరెక్టర్ అవినాశ్‌ పంత్‌, మీడియా పార్ట్‌నర్‌షిప్స్‌ డైరెక్టర్‌ సాకేత్‌ ఝా సౌరభ్‌ సైతం ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇలా భారత్‌లో మార్కెటింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, మానవ వనరుల విభాగాల్లో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news