ఆకతాయి అని పొరబడిన మహిళ.. భర్త కొట్టడంతో పట్టాలపై పడిన వ్యక్తి.. వీడియో వైరల్

-

చిన్న అపార్థం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పక్కనే నిల్చున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పొరబాటు పడిన మహిళ అతడితో గొడవపడింది. అది చూసి కోపంతో ఆమె భర్త.. ఆ వ్యక్తిని కొట్టగా దురదృష్టవశాత్తూ అతడు పట్టాలపై పడటం, రైలు అతడిపైనుంచి దూసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. ముంబయిలోని సియాన్‌ రైల్వేస్టేషన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవినాష్ మానె, శీతల్‌ దంపతులు మన్‌ఖుర్ద్‌ వెళ్లేందుకు సియాన్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. రైలు కోసం ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తుండగా.. 26 ఏళ్ల దినేశ్‌ రాథోడ్‌ అటుగా వస్తూ శీతల్‌కు తగిలాడు. అతడు ఉద్దేశపూర్వకంగానే అలా చేస్తున్నాడని భావించిన ఆమె.. అతడితో గొడవకు దిగి.. తన వద్ద ఉన్న గొడుగుతో కొట్టింది.

గమనించిన శీతల్‌ భర్త అవినాశ్‌.. తన భార్యను రాథోడ్‌ వేధిస్తున్నాడని భావించి ఆ వ్యక్తిని కొట్టగా అతడు బ్యాలెన్స్ కోల్పోయి రైలు పట్టాలపై పడ్డాడు. పట్టాల మధ్య పడిపోయిన రాథోడ్‌ ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించేలోపే రైలు దూసుకురావడంతో రాథోడ్ దాని కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను ధారావి ప్రాంత వాసులుగా గుర్తించి అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news