ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ‘క్రీమీలేయర్’ వర్తింపజేయం.. కేంద్రం కీలక ప్రకటన

-

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీలేయర్‌ వర్తింపజేయ కూడదని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని తెలిపింది. శుక్రవారం రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు చేసిన సూచనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిపినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. చివరకు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని తీర్మానించినట్లు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ నిబంధన లేదని వెల్లడించారు. ఆ ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ప్రస్తావనపై బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీల బృందంప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో ఎటువంటి మార్పులు ఉండవని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news