మొన్న జర్మనీ, నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై కామెంట్స్!

-

ఇటీవల భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. వీటిని భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఖండిస్తూ.. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశాల జోక్యం సహించబోమని గట్టి వార్నింగ్ కూడా ఇస్తోంది. అయితే తాజాగా ఏకంగా ఐక్య రాజ్య సమితి కూడా భారత్పై వ్యాఖ్యలు చేసింది. భారత్‌ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ అన్నారు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

ఎన్నికల ముందు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు, కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటంతో భారత్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ఓ విలేకరి ప్రస్తావించగా.. డుజారిక్‌ ఈ విధంగా స్పందించారు. కేజ్రీవాల్‌ అరెస్టుపై ఇప్పటికే జర్మనీ, అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌ స్పందిస్తూ ఇవి పూర్తిగా దేశ అంతర్గత విషయాలని.. ఈ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని ఏమాత్రం ఆమోదించబోమని తేల్చి చెప్పింది. ఇది జరిగిన ఒకరోజు వ్యవధిలోనే ఐరాస స్పందించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news