పశ్చిమబెంగాల్ అసెంబ్లీ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ బీజేపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. బంగ్లాదేశ్ ఛాందసవాదులతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే.. తన పదవీకి రాజీనామా చేస్తానన్నారు. బంగ్లాదేశ్ ఛాందసవాదులతో చేతులు కలిపారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాజాగా మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడుతూ బీజేపీ తీరుపై విరుచుకుపడ్డారు.
అసెంబ్లీలో మాట్లాడటానికి అనుమతించడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారు. విద్వేషాలను వ్యాప్తి చేయడానికి ప్రజలను విభజించడానికి వారికి వాక్ స్వాతంత్య్రం అనుమతించదు. బీజేపీ మతాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది. నేను జాతీయ భద్రతా లేదా విదేశాంగ విధానం వంటి అంశాల జోలికి వెల్లను.. కానీ అమెరికా నుంచి అక్రమ వలసదారులను గొలుసులతో బంధించి వెనక్కి పంపించడం సిగ్గు చేటు అన్నారు. వారిని అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం విమానాలు పంపాలి. బీజేపీ ఎమ్మెల్యేలు తనను ఎదుర్కొనేందుకు భయపడుతున్నారని తెలిపారు.