దిల్లీలో కలకలం.. గోడ దూకి పార్లమెంట్‌ ప్రాంగణంలోకి వెళ్లిన యువకుడు

-

దిల్లీలో మరోసారి కలకలం రేగింది. పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్య ఘటన చోటుచేసుకుంది.  ఓ యువకుడు పార్లమెంట్‌ గోడ దూకి లోపలికి చొరబడేందుకు యత్నించిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 20 ఏళ్ల వయసున్న మనీశ్.. ఇంతియాజ్‌ ఖాన్‌ మార్గ్‌ వైపు ఉన్న గోడ దూకి పార్లమెంట్‌ అనెక్స్‌ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడని అధిాకరిక వర్గాలు తెలిపాయి. అతడిని గమనించిన సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారని వెల్లడించారు. నిందితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని నిర్ధరించుకున్న తర్వాత అతడిని దిల్లీ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.

నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. ఎత్తుగా ఉన్న గోడను అతడు ఎలా ఎక్కాడు? ఎందుకు పార్లమెంట్‌ ప్రాంగణంలోకి ప్రవేశించాడు అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పిన పోలీసులు.. సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version