కేంద్రం ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌ను : రాహుల్‌

-

ఐదు వేల గంటలైనా వేచి చూస్తానే తప్ప.. కేంద్రం ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరాటం రైతులు, కూలీలకు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ‘భారతీయుల పోరాటం’ అని ఆయ‌న అభివర్ణించారు.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల‌కు మ‌ద్ద‌తుగా పంజాబ్‌ నుంచి చేపట్టిన 3 రోజుల ట్రాక్టర్‌ ర్యాలీ మంగళవారం హరియాణా సరిహద్దుల్లోకి చేరుకుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ఈ ర్యాలీని హరియాణా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయ‌కులు, పోలీసులకు మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. దీంతో ప‌రిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మార‌డంతో రాహుల్ ర్యాలీని తిరిగి అనుమతించారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వ ఒత్తిళ్లకు భ‌య‌ప‌డేది లేద‌ని అన్నారు. అనంతరం గంట సేపటికి హరియాణా సర్కారు ర్యాలీని అనుమతించింది. ఆ తర్వాత పంజాబ్‌లోని మోగా జిల్లాలో ట్రాక్టర్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యసాయ చట్టాలతో రైతులు, కూలీలు కొందరు కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో ‘బానిస’లుగా మారిపోతారన్నారు. కాగా, హాథ్రాస్‌లో దళిత యువతిపై జరిగిన అత్యాచారాన్ని ‘దుర్ఘటన’గా అభివర్ణించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధైర్యం చాలడం లేదని దుయ్యబట్టారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news