వైసీపీ గూటికి ఆర్.కృష్ణయ్య.. మరో ముగ్గురికి రాజ్యసభ సీటు..!

-

జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వైసీపీ గూటికి చేరనున్నారు. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన ప్రత్యక్షమయ్యారు. అయితే ఇటీవల కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్.కృష్ణయ్య తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం సీఎం జగన్ కర్నూల్ టూర్‌లో ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చారనే వాదన వినిపిస్తోంది. సీఎం టూర్ పూర్తయ్యాక అతడిని కలుస్తారని సమాచారం.

కాగా, ఆర్.కృష్ణయ్య ప్రస్తుతం బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఎల్‌బీ నగర్ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం ఏ పార్టీలోనూ కొనసాగడం లేదు. అయితే ఏపీలో సీఎం జగన్ పదవుల విషయంలో సామాజిక సమీకరణలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్.కృష్ణయ్యతోపాటు మరో నేత బీద మస్తాన్ రావు కూడా వచ్చారు.

ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ సీట్లకు అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. విజయసాయి రెడ్డి, ఆర్.కృష్ణయ్య,  సినీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి, నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా, ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ నుంచి ఏపీ రాజ్యసభ సీటుకు ఆర్.కృష్ణయ్యకు అవకాశం ఇవ్వడం ఆశ్చర్యకరమైన విషయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version