కృష్ణా , గోదావరిలకు భారీగా వరద! శ్రీశైలంలో నాలుగు గేట్ల ఎత్తివేత!!

-

కృష్ణానదికి ఎగువ రాష్ర్టాల నుంచి వస్తున్న వరదనీటితో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ సీజన్‌లో రెండోసారి శ్రీశైలంలో గేట్లను ఎత్తివేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం 4 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో ఇన్‌ఫ్లో 3.29 లక్షలుగా ఉండగా, ఔట్‌ఫ్లో 2.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నిలువ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే. ప్రస్తుతం 211 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం నీటి మట్టం 884.30 అడుగులు. శ్రీశైలంలో కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దిగువ సాగర్‌కు భారీగా వరద నీరు విడుదల చేస్తున్నారు.

గోదావరికి ప్రమాదస్థాయిలో వరద!!

రాష్ట్రంలో పెద్ద నది గోదావరికి ఇదే పరిస్థితి. సీజన్‌లో రెండోసారి భారీ వరద వస్తుంది. ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. నీటి మట్టం గంటగంటకు పెరుగుతుంది. భద్రాచలం వద్ద 51 అడుగులకు నీటి మట్టం చేరింది. ధవళేశ్వరం బ్యారేజివద్ద ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు. 13లక్షల 22వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఈసారి 16 లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

భద్రాచలం ప్రధాన రహదారిపైకి నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు వరదబారిన పడ్డాయి. గంట గంటకు ఉధృతి పెరగడంతో పంట పొలాలు, అరటి తోటలు నీటమునిగాయి. వరద ప్రవాహానికి మన్యంలో గ్రామాలు నీట మునగడంతో గిరిజనులు బిక్కు బిక్కుమంటున్నారు. పరిస్థితి దారుణంగా ఉంటే అధికారులు సహాయక చర్యలు అందించడంలో విఫలమయ్యారని ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోనసీమ లంకల్లోకి వరద ప్రవేశించింది. పోలవరం కాఫర్ డ్యామ్ వద్ద 27.80 మీటర్ల మేర వరద చేరింది. స్పిల్వే వద్ద 27.50 మీటర్లు. కొత్తూరు కాజ్‌వేపై 10 అడుగుల చొప్పున నీటి ప్రవాహం ఉంది. మరోవైపు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోకి వరదనీరు చేరడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. పత్తి, మిరప పంటలు ముంపునకు గురయ్యాయి. వరద దృష్ట్యా మండల ప్రత్యేక అధికారులు అప్రమత్తంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news