కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఎంఐఎంను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఎంఐఎం(MIM), బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలన్నీ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు పార్టీలు ఏకమయ్యాయని.. కాంగ్రెస్, భారాసకు ఓట్లున్నా పోటీ చేయడం లేదని ఆరోపించారు.
మరోవైపు గ్రూప్-1 అభ్యర్థుల గురించి మాట్లాడుతూ.. వారి అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో న్యాయ విచారణ చేయాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయిందని.. రేవంత్ సర్కారులో గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. గ్రూప్-1 అభ్యర్థుల ఫిర్యాదులు పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూల్యాంకనంలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని.. న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. కష్టపడి చదివిన అభ్యర్థులకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.