బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వారి మరణానికి చింతిస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణం పార్టీ కి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేత గా పేరు సంపాదించారని తెలిపారు.

జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణం తో శోకతప్తులైన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.