కాంగ్రెస్‌ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం

-

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళా కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.

యామన్‌పల్లిలో సాయంత్రం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మహాముత్తారం మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు జాడి కీర్తిబాయి(45) ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం అటవీ గ్రామమైన పెగడపల్లిలో ప్రచారం నిర్వహించడానికి ఆమె భర్త స్తంభంపల్లి(పి.పి) గ్రామ తాజా మాజీ సర్పంచి జాడి రాజయ్యతో కలిసి కారులో బయల్దేరగా.. నిమ్మగూడెం సమీపంలోని మూల మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. వెంటనే రోడ్డు కిందకు దూసుకెళ్లి మట్టి కుప్పను బలంగా ఢీకొట్టడంతో కీర్తిబాయి అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం నడుపుతున్న రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ఇరువురిని బయటికి తీసి చికిత్స నిమిత్తం రాజయ్యను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version