సిద్దిపేట నియోజకవర్గంలో ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకునేందుకు మిడ్ మానేరు నుండి 1 టీఎంసీల నీటిని రంగనాయక సాగర్ లోకి ఎత్తి పోయాలని నీటి పారుదల
శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మాజీ మంత్రి టి.హరీష్ రావు ఫోన్ ద్వారా అభ్యర్థించారు. యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు పంట పొలాలకు సాగు నీటిని అందించాలని కోరినట్లుగా హరీష్ రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
రంగనాయక సాగర్ కింద ప్రతి యేటా గణనీయంగా పంట రాబడి పెరుగుతుందన్నారు. ఈ ఏటా 50 వేల ఎకరాల పంట ఉన్నదని ఫోన్ లో మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు వివరించారు. రంగనాయక సాగర్ లో ఇటీవల మీరు 2.4 టీఎంసీల నీళ్లు పంపింగ్ చేశారని ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 1.5 టీఎంసి ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యాసంగి పంటకు పూర్తి స్థాయిలో నీరు అందాలి అంటే ఇంకా కనీసం 1 టీఎంసీల నీళ్లు అవసరం ఉన్నాయన్నారు . కావున మిడ్ మానేరు నుండి రంగనాయక సాగర్ లోకి వెంటనే నీళ్లు పంపింగ్ చేయాలనీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించగలరని విజ్ఞప్తి చేశారు. రైతులు సాగు నీళ్లు లేక పంటలు ఎండి పోయే పరిస్థితి ఉందని, అన్నదాతలు తీవ్ర ఆందోళన లో ఉన్నారని గుర్తు చేశారు. పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.