సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యం అయిందని మంత్రి దామోదరన రాజనర్సింహ అన్నారు. మరో 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం రాబోతున్నదని.. చట్టం రాగానే 25 వేల పోస్టులతో వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నదని చెప్పారు. సోమవారం హైదరాబాద్ టూరిజం కన్వెన్షన్ హాల్ లో ఎస్సీ వర్గీకరణపై మాదిగ నేతలతో మంత్రి దామోదర సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆరు నెలల్లోనే 90 శాతం వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. వర్గీకరణ చేసే వరకు నోటీఫికేషన్లు ఇవ్వమని సీఎం చెప్పారని ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్తనోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. వర్గీకరణపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అందరి అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత తమదేనన్నారు. తెలంగాణ వస్తే మనందరి తలరాతలు మారుతాయని భావించినట్టుగానే ఎస్సీ వర్గీకరణతో సంపూర్ణంగా మాదిగలందరి తలరాతలు మారుతాయనుకోవడం పొరపాటు అన్నారు మంత్రి దామోదర. వర్గీకరణ వల్ల ఎవ్వరి వాటా వల్ల వారికి అడ్మిషన్లు, ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.