సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో బహిరంగ లేఖ రాశారు. కుక్ కం హెల్పర్లకు చెల్లించే రూ. మూడు వేల గౌరవ వేతనం గతేడాది డిసెంబర్ వరకే వచ్చాయి. 2024 జనవరి, ఫ్రిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్లకు సంబంధించిన ఐదు నెలల వేతనాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు జనవరి 2024 వరకు మాత్రమే వచ్చాయి.

ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్కు సంబంధించిన నాలుగు నెలల బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని… ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు ఏప్రిల్ 2024 వరకు మాత్రమే వచ్చాయి. జూన్ నెల బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు.
కోడిగుడ్డు బిల్లులు జనవరి 2024 వరకు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్కు సంబంధించి నాలుగు నెలల బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని… సర్వశిక్ష అభియాన్ మరియు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల (IERP) వేతనాలు మే 2024 వరకే వచ్చాయి. మిగతా నెలలవి పెండింగ్లోనే ఉన్నాయన్నారు. గతంలో పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ గ్రామపంచాయతీల ద్వారా జరిగేది. కానీ ఈ బాధ్యతను అమ్మ కమిటీలకు అప్పగించి నిర్వహిస్తామని చేసిన మీ ప్రకటన మాటలకే పరిమితమైంది. దీంతో పారిశుధ్య నిర్వహణ ప్రశ్నార్థకమైంది. ఇచ్చిన మాట ప్రకారం, తక్షణమే ప్రతి పాఠశాలకు నెలకు రూ.10 వేలు విడుదల చేసి, పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని కోరుతున్నానని చెప్పారు. పేద విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం ఆగిపోయింది. ఈ కార్యక్రమాన్ని సహృదయంతో తిరిగి పునర్ ప్రారంభించాలని కోరుతున్నానని వివరించారు. ఈ సమస్యలు తీర్చాలని కోరారు.