బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం అనేది చారిత్రక అవసరం అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవడం.. తెలంగాణ సమాజానికి మళ్లీ తిరిగి కేసీఆర్ను సీఎం చేయడం చారిత్రక అవసరం అని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని వ్యాఖ్యానించారు. కచ్చితంగా ఏప్రిల్ 27వ తేదీ నాడు.. వరంగల్కు తరలిరావాలి బీఆర్ఎస్ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్లో రాజేంద్ర నగర్ ఇంఛార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారందరికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పదేండ్ల పాటు సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించిన కేసీఆర్.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల పార్టీకి జరిగిన నష్టం తక్కువని.. కానీ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నింగినంటేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని.. ఆయన సాధించిన విజయాలు.. చేసిన అభివృద్ధి.. కొల్లగొట్టిన రికార్డులు ఎవరూ చెరపలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని ఎవరన్న అనుకుంటే అది వారి అజ్ఞానం అని అన్నారు.