త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నేతలకు ప్రాతినిథ్యం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. ఈ నిర్ణయంతో పార్టీకి, ప్రజలకు మేలు జరుగుతుందని తెలుపుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
కేబినెట్ విస్తరణ అంశంపై జానారెడ్డి హైకమాండ్కు లేఖ రాయడం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కేబినెట్లో ప్రాతినిథ్యం లేకపోవడాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అనేకసార్లు బహిరంగంగానే ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ కోటాలో తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈసారి కేబినెట్ లో ఆయనకు చోటు దక్కుతుందా ? లేదా ? అన్నది సస్పెన్స్గా మారింది.