కాంగ్రెస్ బస్సు యాత్ర.. తుస్సుమనడం ఖాయం : మంత్రి కేటీఆర్

-

కాంగ్రెస్ బస్సు యాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ బస్సుయాత్ర… తుస్సుమనడం ఖాయమని అన్నారు. ‘సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక’.. అని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో.. గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని అడిగారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్​కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు కేటీఆర్.

కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్​ పార్టీదని.. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీదని కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని.. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన తమదని తెలిపారు.

“నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు… కరప్షన్ కు కేరాఫ్… కాంగ్రెస్. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు.. ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ?? దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు… ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణం. నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్ గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే.. తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది.” అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news