కులగణన, బీసీ రిజర్వేషన్ల బిల్లులకు సహకరించిన గవర్నర్కు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు చెప్పారు. మంగళవారం నోవాటెల్లో సీఎల్పీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళిందని.. ఇటీవల సుప్రీంకోర్టు కూడా రెండు నెలల్లో విషయాన్ని తేల్చాలని చెప్పింది.. తప్పకుండా సానుకూల తీర్పే వస్తుందని నమ్ముతున్నట్లు మంత్రి తెలిపారు. శాసనసభలో బీసీల రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని గుర్తుచేశారు. కులగణన సర్వేను లక్ష మంది ఉద్యోగులో నిర్వహించామని.. న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సమాచార సేకరణ జరిగిందని చెప్పారు.
ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ప్రజలంతా కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలపై చర్చించుకునేలా చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే బీసీల రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. రాహుల్ గాంధీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారని అన్నారు.