కేసీఆర్ పేరుతో నిలువెత్తు బంగారాన్ని స‌మ‌ర్పించిన ఎమ్మెల్సీ క‌విత‌

-

మేడారంలో స‌మ్మ‌క్క‌- సార‌ల‌మ్మ జాత‌ర కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరుతో శ‌నివారం నాడు నిలువెత్తు బంగారాన్ని ఎమ్మెల్సీ క‌విత స‌మ‌ర్పించారు. ఆన్‌లైన్‌లో టీ యాప్ ఫోలియో అనే యాప్ ద్వారా క‌విత బంగారాన్ని స‌మ‌ర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపిన సంగ‌తి తెలిసిందే. రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలోనూ సమ్మక్క సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ పేర్కొన్నారు. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్య పాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరి లోయ పరివాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలంతో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని అన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా తల్లుల దర్శనార్థం కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్‌ సూచించారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news