తెలంగాణ బిజెపికి భారీ షాక్ తగిలింది. బిజెపి ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిజెపికి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఈ సంచలనం నిర్ణయం తీసుకున్నారు రాజాసింగ్. తనని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదని, అధ్యక్ష పదవి ఎన్నికలలో పాల్గొనందుకు వచ్చిన తన మద్దతుదారులను బెదిరించారని.. అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను అంగీకరించాలని కోరినట్లు తెలిపారు రాజాసింగ్. ఎమ్మెల్యేగా రాజీనామాపైన స్పీకర్ కి లేఖ పంపాలని కోరారు. తెలంగాణలో బిజెపి అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఈరోజు ఉదయం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా అధిష్టానం ఒక వ్యక్తిని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని.. అధ్యక్షుడిని బూత్ స్థాయి కార్యకర్త నుంచి ముఖ్య నాయకుల వరకు ఓటు వేసి ఎన్నుకోవాలని అన్నారు. కానీ ఎవరిని పడితే వారిని నియమించుకుంటూ పోతే పార్టీకి నష్టం చేకూరుతుందన్నారు రాజా సింగ్. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలంటే ఎన్నిక ఈ విధంగానే జరగాలన్న ఆయన.. అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు.