ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు రూ. 650 కోట్లతో ఎలివేటెడ్ ఓవర్ కారిడార్ నిర్మించనున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆదివారం ఎల్బీనగర్లోని ఎలివేటెడ్ ఓవర్ నిర్మాణ పనుల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వనస్థలిపురంలో పర్యటించారు. పనామా గోడౌన్స్ నుంచి సుష్మా థియేటర్ చౌరస్తా వరకు ఆర్అండ్ బీ అధికారులు, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎల్బీనగర్ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు నాకు తెలుసన్నారు.ఎంపీగా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నాను.. ఈ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నామని చెప్పారు. జాతీయ రహదారుల అభివృద్ధి పనులపై చర్చించడానికి ఈ నెల 6న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.