మద్యం మత్తులో కత్తులతో వీరంగం సృష్టించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్ మైండ్ స్పేస్ దగ్గర మద్యం మత్తులో కత్తులతో బెదిరించి దారి దోపిడీకి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే వారిని చితకబాదిన స్థానికులు వెంటనే మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేసి మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ముగ్గురు బాలానగర్ రాజుల కాలనీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చెడు అలవాట్లకు బానిసై ఈ ముగ్గురు వ్యక్తులు దారిదోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో పోలీసులు తేల్చారు.