అధికారంలోకి రాగానే వారి ఇళ్లపైకి బుల్డోజర్లు : కేంద్ర మంత్రి సాధ్వి

-

తెలంగాణలో అధికారంలోకి రాగానే క్లీనింగ్ స్టార్ట్ చేస్తామని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే.. ప్రజలను దోచుకుంటున్న వారి ఇళ్లపైకి బుల్డోజర్లు పంపి కూల్చివేస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెద్ద అంబర్‌పేట వద్ద నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు సాధ్వి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. కేసీఆర్‌ ఎస్సీ, గిరిజన, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడితే కనీసం మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలో మార్పు వచ్చిందని.. త్వరలోనే బీజేపీ సర్కారు రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో పెను మార్పులు జరగబోతున్నాయని.. ఈ మంచి మార్పునకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి సాధ్వి అన్నారు. రాష్ట్రాన్ని నడిపించే ప్రజల సొమ్మును లూటీ చేస్తున్న నేతలైనా వేరే ఎవరైనా.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామని హెచ్చరించారు. అలాంటి వారి లెక్కలు తేల్చాలా వద్దా చెప్పండని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version