బిగ్ బ్రేకింగ్ : ప్రాంతీయ భాషల్లో జేఈఈ మెయిన్స్

-

జేఈఈ (మెయిన్స్) పరీక్షను మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) నిర్ణయించిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ), 2020కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రాంతీయ భాషలో నిర్వహించే పరీక్ష ఆధారంగా రాష్ట్ర ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఆయన అన్నారు. జేఈఈ (మెయిన్స్) ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పించే రాష్ట్రాల స్టేట్ లాంగ్వేజ్‌‌ను కూడా దీనిలో చేరుస్తామని ఆయన అన్నారు.

పీఐఎస్ఏ పరీక్షలో టాప్ స్కోరింగ్ కంట్రీస్ బోధనా మాధ్యమంగా మాతృ భాషను ఉపయోగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశ్నలను అవగాహన చేసుకుని మరింత మెరుగైన స్కోర్ సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆయన అన్నారు. అయితే తాము ఇంగ్లిష్‌కు వ్యతిరేకం కాదని, విద్యా బోధనా మాధ్యమంగా మాతృ భాష ఉంటే భారతీయ భాషలు బలోపేతమవడానికి దోహదపడుతుందన్నారు. ఏ రాష్ట్రంపైనా ఏదైనా భాషను రుద్దాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అన్నారు 22 భారతీయ భాషలను బలోపేతం చేయడానికి తాము సానుకూలంగా ఉన్నామన్న ఆయన ఈ భాషలన్నిటినీ ప్రోత్సహిస్తామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news