బాలుడిని పని మనిషికి అప్పగించి వెళ్ళిన పేరేంట్స్.. అనుమానంతో సీసీ కెమెరాలు చెక్ చేయగా..

-

పిల్లల్ని పనిమనుషుల వద్ద వదిలి పెట్టి వెళ్లే తల్లిదండ్రులకు ఇదో షాకింగ్ వార్త అనే చెప్పాలి. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఓ ఇంటి పని మనిషి చేసిన దారుణం ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ వీడియో చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఆ ఇంట్లో భార్య, భర్తలు ఇద్దరు ఉద్యోగులే. ప్రతిరోజు ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్లాల్సిందే. దీంతో వారి రెండేళ్ల చిన్నారిని చూసుకునేందుకు ఒక పని మనిషిని మాట్లాడుకున్నారు. తమ చిన్నారిని ఆమె వద్ద వదిలి నిశ్చింతగా డ్యూటీలకి వెళ్లి వచ్చేవారు.

అయితే చిన్నారి లో క్రమంగా మార్పు రావడం, రోజురోజుకు నీరసంగా తయారవుతుండడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దంపతులు కుమారుడిని వైద్యునికి చూపించారు. దీంతో అన్ని టెస్టులు చేసిన వైద్యుడు షాకింగ్ విషయం చెప్పాడు. టెస్ట్ రిపోర్ట్స్ లో బాలుడి అంతర్గత అవయవాలు వాచిపోవడం గుర్తించి విషయం చెప్పడంతో తల్లిదండ్రులిద్దరూ నిర్ఘాంతపోయారు. దీంతో ఇంట్లో ఏదో జరుగుతుందని అనుమానించిన బాలుడి తల్లిదండ్రులు వైద్యుడి సలహా మేరకు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు అమర్చారు. ఒకరోజు ఆ సీసీటీవీ లో రికార్డ్ అయిన దృశ్యాలు చూసి వారు విస్తుపోయారు.

అప్పటివరకు అనుకువగా ఉంటున్న పనిమనిషి రజిని చౌదరి వారు ఆఫీసులకు వెళ్లిపోయిన తర్వాత వికృతంగా మారిపోయి చిన్నారినీ ఇష్టం వచ్చినట్లు కొట్టడాన్ని చూసి తల్లిదండ్రులు వాపోయారు. అన్నం తినకపోయినా.. వాష్ రూమ్ కి వెళ్ళినా.. చెప్పిన మాట వినకపోయినా.. తాను ఫోన్ చూసుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేసినా.. ఆ పని మనిషి పిల్లవాడి పై తన ప్రతాపం చూపిస్తోంది. కనికరం లేకుండా రెండేళ్ల చిన్నారిని చితకబాదుతుంది.

ఇది చూసిన తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. దీంతో వాళ్లు ఆగ్రహానికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పనిమనిషిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news