కునో పార్కులో ఐదు కూనలకు జన్మనిచ్చిన చీతా

-

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో ‘గామిని’ అనే దక్షిణాఫ్రికా చీతా ఐదు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో షేర్ చేసుకున్నారు. దక్షిణాఫ్రికాలోని  త్స్వాలు కలహరి రిజర్వ్ నుంచి తీసుకొచ్చిన ఈ ఆడ చీతా ఐదు కూనలకు జన్మనిచ్చినట్లు తెలిపారు.  దీంతో కునో పార్కులో జన్మించిన చీతా కూనల సంఖ్య 13కి చేరిందని వెల్లడించారు. గామిని భారత గడ్డపై ప్రసవించిన నాలుగో చీతా అని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో మొదటిదని వివరించారు.

చీతాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించి వాటి వృద్ధిని పెంపొందించేందుకు కృషిచేసిన అటవీ శాఖ అధికారులు, వైద్యులు, ఫీల్డ్‌ సిబ్బందిని కేంద్రమంత్రి అభినందించారు. ఈ కూనలతో పాటు కునో జాతీయ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 26కి చేరిందని తెలిపారు. వీటి సంఖ్య మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భారత్‌లో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news