రమణదీక్షితులుపై కేసు వ్యవహారంలో ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశం

-

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీవారి ఆలయం, తితిదే అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తితిదే ఐటీ శాఖకు చెందిన మురళీ సందీప్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తిరుమల పోలీసులు రమణ దీక్షితులుపై ఈ ఏడాది ఫిబ్రవరి 23న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రమణదీక్షితులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి ప్రతాప .. 41ఏ నోటీసు నిబంధనను పాటించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ పోలీసులు ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేస్తే దానిని సవాలు చేసుకునే స్వేచ్ఛను పిటిషనర్‌కు ఇస్తూ వ్యాజ్యంపై విచారణను మూసివేశారు.

Read more RELATED
Recommended to you

Latest news