40 స్తంభాలతో నిర్మించిన పురాతన శివాలయం ఎక్కడుందో తెలుసా ?

-

మనదేశంలో దేవాలయాలకు కొదవలేదు. ప్రతిచోట ఏదో ఒక దేవాలయం, ఏదో ఒక చారిత్రక కట్టడం అనేది సర్వసాధారణం. అయితే వందల ఏండ్ల కింద ప్రస్తుత సాంకేతికత లేని సమయంలో నిర్మించిన అద్భుత కట్టడాలు నేటికి అందరినీ అబ్బురపరుస్తున్నాయి. అటువంటి దేవాలయాల్లో ఒకటి ఈ శివాలయం. ఇక్కడ 40 స్తంభాలతో దేవాలయాన్ని నిర్మించారు. ఆ విశేషాలు తెలుసుకుందాం…

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు పచ్చని పంట పొలాలతో నిండి ఉన్న గ్రామం. ఈ గ్రామంలో లేని ఆలయం అంటూ లేదు. ఎటు చూసిన ఆలయాలు దర్శనం కనిపిస్తుంది. సకల దేవతలు ఇంద్రపాల నగరంలో కొలువై ఉన్నారు. ఈ ఇంద్రపాల నగరానికి ఘనమైన చరిత్ర ఉంది. క్రీ.శ 4 వ శతాబ్దంలో విష్ణు కుండినులు రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. వీరి చరిత్రకు సంబంధించిన పురాతన శాసనాలు ఇక్కడ లభ్యం అయ్యాయి. ఇంద్రపురి గ్రామం క్రమేపి ఇంద్రపాల నగరంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ గ్రామంలో 1500 ఎకరాల విస్తరించిన పెద్ద చెరువు ఈ గ్రామాన్ని సస్యశామల చేస్తుంది. ఈ చెరువు ఎప్పుడు నీటి తో కలకల ఆడుతుంది.

పురాతన శివాలయాల దర్శనం సర్వపాప హరం. వాటిలో పూర్వ, చారిత్రాత్మక ఆలయాలు దర్శించుకుంటే మరీ మంచిదని పెద్దలు చెప్తుంటారు. ఇంద్రపాల నగరం గ్రామంలో గల ఆలయాలలో పురాతన ఆలయం శివాలయం. ఈ ఆలయం 40 స్తంభాలతో నిర్మించారు. ఈ ఆలయం ముందు రెండు అంతస్తులు గల కళ్యాణ మండపం గలదు. ఈ శివాలయం క్రీ.శ 388 నుండి 624 మధ్యలో నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆలయానికి దక్షిణాన భాగంలో పెద్ద చెరువుతో పాటు ఉత్తరాన పెద్ద గుట్ట తో పాటు మూసి నది ఉంది. దూరంగా పొలాలు చుట్టూ చెరువు, ఆధ్యాత్మికత తో పాటు శతాబ్దాల చరిత్ర ఈ ఆలయం సొంతం. భక్తులు కోరిన కోర్కెలు శివుడు తప్పకుండ తీరుస్తాడని గ్రామస్తులు నమ్మకం. ఆ నమ్మకంతో గ్రామస్తులు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఘనంగా పూజలు, జాతర నిర్వహిస్తారు.

ఈ సందర్బంగా ఆలయం ముందు అగ్ని గుండాలు ఏర్పాటు చేసి, ప్రజలు నిప్పుల పై నడుస్తారు. అనంతరం దేవునికి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు ప్రతి సంవత్సరం ఆడపడుచులను ఇళ్లకు పిలుచుకొని ఘనంగా పండగ నిర్వహిస్తారు. ఈ జాతరలో పాల్గొంటే వర్షాలు పడి పంటలు పండి సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా బతుకుతామని వారి నమ్మకం. చుట్టుపక్క గ్రామాలకు ఎంత కరువు వచ్చిన ఇక్కడి చెరువు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎండిపోలేదని గ్రామస్తులు చెపుతుంటారు. దేవాలయాలకు నెలవైన చారిత్రక స్థలం ఇది. అవకాశం ఉన్నప్పుడు దర్శించి తరించండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news