సూరత్‌లో కుప్పకూలిన భవనం.. ఏడుగురు దుర్మరణం

-

గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. సచిన్‌ పాలీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇంకా కొంతమంది శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న సహాయ బృందాలు శిథిలాలు తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. శిథిలావస్థకు చేరిన ఆ భవనం, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.

శనివారం రోజున జరిగిన ఈ ఘటనలో శిథిలాల్లో చిక్కుకున్న పలువురి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి. 2016లో నిర్మించిన భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే ఏడుగురు మరణించారని, మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని వెల్లడించారు. వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లలో ఉండకూడదని, వెంటనే వాటిని ఖాళీ చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news