ప్రయాణికులకు శుభవార్త వందేభారత్ తొలి స్లీపర్ రైలు ఆగస్టులో పట్టాలు ఎక్కనుంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య విడతలవారీగా ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సికింద్రాబాద్ – ముంబయి నగరాల మధ్య నడిపనున్నట్లు సమాచారం.
ఈ నగరాల మధ్య ఇప్పటివరకు వందేభారత్ రైళ్లు లేనందున తొలి స్లీపర్ రైలు ఈ మార్గంలో నడపాలని కేంద్ర గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్రెడ్డి ద.మ.రైల్వే జీఎం అరుణ్కుమార్కు తాజాగా సూచించారు. ఈ మేరకు ద.మ.రైల్వే జోన్.. రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు సికింద్రాబాద్ – పుణెల మధ్య నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందేభారత్ రైలు (సిట్టింగ్) రానున్నట్లు సమాచారం.
మరోవైపు కాచిగూడ-బెంగళూరు మధ్య 8 కోచ్లతో నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్కు డిమాండ్ బాగా ఉండటంతో దాన్ని 16 కోచ్లకు పెంచాలన్న డిమాండ్నూ ద.మ.రైల్వే పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తుది దశలో ఉన్న చర్లపల్లి టెర్మినల్ పనుల్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడంపై ద.మ.రైల్వే దృష్టి సారించింది.