జ్వరాల విజృంభణపై ప్రజలకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం : హరీశ్ రావు

-

డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతోందని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిపారు.

‘రాష్ట్రంలో జ్వరాలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇంటిల్లిపాదీ మంచానపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే ముందే ఊహించి మేం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాం. నిధులు విడుదల చేసి పారిశుద్ద్య నిర్వహణ కొనసాగించాలని కోరాం. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని వానాకాలం ప్రారంభంలోనే చెప్పాం. కానీ ప్రభుత్వం మా సూచనలను పట్టించుకోలేదు. సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే విషజ్వరాలు ఇంతగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలు బలి తీసుకునేవి కావు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేల్కొని పారిశుద్ధ్య నిర్వహణ, ఆసుపత్రుల సన్నద్దత వంటి ముఖ్యమైన అంశాలపై తక్షణం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుని ప్రజలను కాపాడాలి’ అని ప్రభుత్వానికి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news