జూబ్లీహిల్స్ లోని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నివాసంలో ఈ నెల 15న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ముసుగు, బ్లౌజులు ధరించి ఏకంగా ఇంట్లోకి చొరబడ్డ విషయం తెలిసిందే. అయితే ఇంట్లోని కిచెన్, హాల్, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి లోపలికి వచ్చాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే తిరిగాడు. గమనించిన ఇంట్లోని సిబ్బంది భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమై ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా డీకే అరుణకు ఫోన్ చేసి మాట్లాడారు. అదేవిధంగా తన అనుమానాలకు ఆమె సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కుట్ర కోణం దాగి ఉందని తనకు వెంటనే భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఇవాళ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి ఢిల్లీకి చెందిన అక్రమ్గా గుర్తించారు. మేరకు అతడిని వెస్ట్ జోన్ డీసీసీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. గతంలో ఢిల్లీ, హైదరాబాద్ పాత బస్తీల్లో నిందితుడు అక్రమ్ వరుసగా చోరీలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.