ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 తరువాత అమరావతి రాజధాని పనులను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం. అమరావతి రాజధాని పున:నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
సచివాలయం వెనుక వైపు ప్రాంతంలో రాజధాని పనులు ప్రారంభించాలని.. అదే ప్రాంతంలో సభ కూడా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చూడాల్సిందిగా సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పున: నిర్మాణం పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు రకాల పనులను సీఆర్డీఏ అనుమతి ఇవ్వడం.. కేబినెట్ సమావేశం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్ని జరిగిపోయాయి. తాజాగా సీఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు.