హైదరాబాద్ లో కొత్త లా అండ్ ఆర్డర్.. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు..

-

హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థలో 35 సంవత్సరాల తర్వాత ఒక భారీ పునఃవ్యవస్థీకరణ చేపట్టారు. ఈ మార్పులను సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ సీవీ ఆనంద్, ఐపీఎస్, ఈరోజు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో ఉన్న పోలీస్ స్టేషన్ హద్దులపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ట్రాఫిక్ , లా అండ్ ఆర్డర్ విభాగాల మధ్య అధికార పరిమితులపై స్పష్టత లేకపోవడం, సైబర్ క్రైమ్ వింగ్ బలోపేతం చేయాల్సిన అవసరం వంటి అంశాలపై సమీక్ష అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. నెం. 32 (తేది 30.04.2023) ద్వారా ఈ పునః వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది.

ఈ మార్పుల క్రమంలో నగరాన్ని రెండు అదనపు లా అండ్ ఆర్డర్ జోన్‌లుగా విభజించారు – సౌత్ ఈస్ట్ , సౌత్ వెస్ట్. అలాగే 11 కొత్త లా అండ్ ఆర్డర్ డివిజన్లు, మరో 11 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ట్రాఫిక్ విభాగంలోనూ కీలక మార్పులు చోటుచేసుకోగా, కొత్తగా ఒక అదనపు ట్రాఫిక్ జోన్ ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం ట్రాఫిక్ స్టేషన్ల సంఖ్యను 31కి పెంచారు. మహిళా భద్రతపై మరింత దృష్టి సారిస్తూ, నగరంలోని ఏడుస్థానిక జోన్‌ల్లో 7 ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అంతేకాక, మహిళా భద్రతా వింగ్, ఐటీ విభాగం, నార్కోటిక్స్ వింగ్, ప్రత్యేక సైబర్ క్రైమ్ సెల్లు వంటి యూనిట్లను బలోపేతం చేశారు. ఈ మార్పులన్నింటి కోసం అదనంగా 1,200 మంది సిబ్బందిని మంజూరు చేశారు.

 

మరొక ముఖ్యమైన మార్పు టోలిచౌకి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు. ఇది నగరంలోని 72వ పోలీస్ స్టేషన్‌గా ఏర్పడింది. ఫిల్మ్‌నగర్, మెహదీపట్నం (మునుపటి హుమాయున్‌నగర్), గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధుల నుండి కొన్ని ప్రాంతాలను తీసుకొని ఈ కొత్త స్టేషన్‌ను రూపొందించారు. స్థానిక ప్రజలకు సులభంగా గుర్తుపడేలా డివిజన్లకు , స్టేషన్లకు పేర్లలో మార్పులు చేశారు. గోల్కొండ డివిజన్‌ను టోలిచౌకి డివిజన్‌గా, సెక్రటేరియట్ పిఎస్‌ను లేక్ పిఎస్‌గా, హుమాయున్‌నగర్‌ను మెహదీపట్నం పిఎస్‌గా, షాహినాయత్‌గంజ్‌ను గోషామహల్ పిఎస్‌గా మార్చారు.

ట్రాఫిక్ విభాగంలోనూ కొన్ని స్టేషన్లను రద్దు చేసి, కొత్త పేర్లతో పునః వ్యవస్థీకరించారు. మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లి, నారాయణగూడ ట్రాఫిక్ స్టేషన్లను రద్దు చేసి, లా అండ్ ఆర్డర్ స్టేషన్ల పరిధిని అనుసరించి ట్రాఫిక్ గాంధీనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, కుల్సుంపుర, ఛత్రినాకా, సైదాబాద్ ట్రాఫిక్ స్టేషన్లుగా నామకరణ చేశారు. మహిళా భద్రతా విభాగం లోపల యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), జువెనైల్ బ్యూరో యూనిట్లను ఏర్పాటు చేసి, అందులో ప్రత్యేక సిబ్బంది నియమించారు. అలాగే, ప్రతి లా అండ్ ఆర్డర్ జోన్‌లో ఒక సైబర్ క్రైమ్ సెల్‌ను ఏర్పాటు చేశారు.

ఈ మొత్తం పునః వ్యవస్థీకరణను రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. నెం. 57 (తేది 24.04.2025) ద్వారా అధికారికంగా ఆమోదించింది. ఈ మార్పులు రాబోయే పదేళ్లలో నగర పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయనున్నాయని సీపీ తెలిపారు. త్వరలోనే కొత్త అధికార పరిధి పటాలు, పోలీస్ స్టేషన్ వివరాలు, సంప్రదింపు సమాచారం, అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news