భారత్-పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్తితులు హైదరాబాద్ నగరంలోనూ ప్రతి ధ్వనిస్తున్నాయి. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే నగరంలో బాణసంచా కాల్చడాన్ని నిషేదిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేసారు.
సరిహద్దుల్లోని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నందున నగరంలో బాణసంచా కాల్చడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగే అవకాశం ఉందని సీపీ సీవీ ఆనంద్ భావించారు. బాణసంచా శబ్దాలు పేలుళ్ల శబ్దాలను పోలిఉండటంతో ఇది ప్రజల్లో అనవసరమైన గందరగోళానికి దారితీయవచ్చు. శాంతి భద్రతలను కాపాడటం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ నిషేదాజ్ఞలు జారీ చేశారు. ఈ నిషేదం తక్షణమే అమలులోకి వస్తుందని సీపీ వెల్లడించారు. ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.