మేఘాలయ ప్రభుత్వం వివాహానికి ముందు హెచ్ఐవి పరీక్షను తప్పనిసరి చేయడాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో హెచ్ఐవి కేసులు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వం ఈ విషయంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి అంపరీన్ లింగ్డోహ్ ప్రకటన చేశారు. చట్టపరమైన నిపుణులతో సంప్రదింపులు జరిపి, గోవా వంటి ఇతర రాష్ట్రాలలో ఉన్న చట్టాలను పరిశీలించి, మేఘాలయకు అనుగుణంగా నిబంధనలను రూపొందించాలని చూస్తున్నారు.
ఈ చర్యల ప్రధాన లక్ష్యం సకాలంలో హెచ్ఐవిని గుర్తించడం, తద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించడం, గుర్తించిన వారికి చికిత్స అందేలా చూడటం. హెచ్ఐవి సరైన చికిత్సతో నియంత్రించబడుతుందని, ఇది క్యాన్సర్ లేదా టీబీ లాంటిదేనని మంత్రి పేర్కొన్నారు. తద్వారా హెచ్ఐవితో జీవించేవారి పట్ల ఉన్న అపోహలను కూడా తగ్గించవచ్చని ఆశిస్తున్నారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బలవంతపు హెచ్ఐవి పరీక్షలకు వ్యతిరేకంగా ఉంది. వ్యక్తిగత హక్కులు, గోప్యత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం త్వరలో ఒక క్యాబినెట్ నోట్ను సిద్ధం చేయనుంది. కాగా దేశంలో అత్యధికంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు ఉన్న రాష్ట్రల్లో మేఘాలయ ఆరో స్థానంలో ఉంది.