బీఆర్ఎస్ పార్టీకి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తాజాగా రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రెండుసార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈనెల 09న గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.
గువ్వల బాలరాజు పై పలు కేసులు ఉన్న నేపథ్యంలో బీజేపీలో చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సమయంలో గువ్వల బాలరాజు, ప్రస్తుత ఎమ్మెల్యే వంశీ కృష్ణ మధ్య గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో అచ్చంపేటలో ఆయనకు ఏ పని కావడం లేదని.. బీఆర్ఎస్ నాయకులను పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. బీజేపీ లో చేరితే కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉంటాయని భావించి బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే గువ్వల బాలరాజు తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్ కి పంపించారు. కేసీఆర్ ప్రస్తుతం కాళేశ్వరం గురించి కీలక చర్చలో ఉన్న సమయంలోనే గువ్వల బాలరాజు రాజీనామా చేయడం గమనార్హం.