కాణిపాకం తర్వాత మరో స్వయంభూ గణపతి ఆలయం..చోడవరంలో అద్భుతం!

-

ఆంధ్రప్రదేశ్‌లో స్వయంభూ వినాయకుడు అనగానే మనకు ముందుగా కాణిపాకం గుర్తొస్తుంది. కానీ, అలాంటి ఒక అద్భుతం అనకాపల్లి జిల్లా చోడవరంలో కూడా ఉందని మీకు తెలుసా? దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో స్వామివారు బావిలో వెలిశారు. ఏ పని మొదలుపెట్టినా ఇక్కడి స్వామిని దర్శించుకుంటే విజయం తథ్యమని భక్తుల నమ్మకం. మహిమాన్వితమైన ఈ ఆలయ విశేషాలు చదివితే మీరు కూడా ఆశ్చర్యపోతారు..

బావిలో వెలిసిన విఘ్నేశ్వరుడు: సాధారణంగా మనం విగ్రహాలను ప్రతిష్ఠిస్తాం. కానీ ఇక్కడ వినాయక స్వామి స్వయంగా భూమి నుండి రాతి విగ్రహంగా వెలిశారు. అదీ ఒక బావిలో స్వామివారు సాక్షాత్కరించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక కాణిపాకం తర్వాత మళ్ళీ అంతటి ప్రాశస్త్యం ఉన్న స్వయంభూ ఆలయం ఇదొక్కటేనని స్థానికులు ఎంతో గర్వంగా చెబుతుంటారు.

పెరుగుతున్న గణనాథుని విగ్రహం: ఈ ఆలయంలో మరో వింత ఏమిటంటే, స్వామివారి విగ్రహం ఏటికేడూ పెరుగుతూ ఉంటుందని భక్తుల విశ్వాసం. దీనికి నిదర్శనంగా ఒక ఆసక్తికరమైన విషయం చెబుతారు. ఇక 90 ఏళ్ల క్రితం స్వామివారికి ముప్పావు కేజీ వెండితో కిరీటం చేయించగా, ఇప్పుడు ఆయన శిరస్సుకు సరిపోయేలా కిరీటం చేయాలంటే ఏకంగా రెండు కేజీల వెండి అవసరమవుతోందట.

Rare Swayambhu Ganapathi Idol Found in Chodavaram After Kanipakam
Rare Swayambhu Ganapathi Idol Found in Chodavaram After Kanipakam

జల గణపతిగా దర్శనం:చోడవరం ఆలయంలోని గర్భగుడిలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గర్భగుడి నీటితో నిండిపోవడంతో స్వామివారు ‘జల గణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో స్వామివారి శిరస్సు మాత్రమే బయటకు కనిపిస్తుంది. ఇక పక్కనే ఉన్న శివాలయంలో కూడా నీరు ఊరడం వల్ల అక్కడి శివుడిని గంగా సమేత గౌరీశ్వర స్వామిగా కొలుస్తారు.

అభివృద్ధి పథంలో ఆలయం: ఈ ఆలయానికి తరతరాలుగా కొడమంచిలి వంశీయులు అర్చకత్వం నిర్వహిస్తున్నారు. మొదట్లో బాలగణపతి సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ పుణ్యక్షేత్రం దేవదాయ శాఖ పర్యవేక్షణలో ఉంటూ, భక్తుల సౌకర్యార్థం మరిన్ని మార్పులు చేసుకుంటూ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.

గమనిక:ఈ సమాచారం స్థానిక భక్తుల కథనాలు మరియు పూర్వీకుల నుండి అందుతున్న విశ్వాసాల ఆధారంగా సేకరించబడింది.

Read more RELATED
Recommended to you

Latest news