సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత తల్లులే మానసిక ఒత్తిడికి గురవుతారని మనం అనుకుంటాం. కానీ, తాజా పరిశోధనలు ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. తల్లులతో పాటే తండ్రులు కూడా తీవ్రమైన డిప్రెషన్కు లోనవుతున్నారని, ముఖ్యంగా బిడ్డ పుట్టిన ఏడాది తర్వాత ఈ సమస్య బయటపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కుటుంబ బాధ్యతలు, మారుతున్న జీవనశైలి వల్ల తండ్రులు ఎదుర్కొంటున్న ఈ ‘పోస్ట్పార్టమ్ డిప్రెషన్’ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
స్వీడన్కు చెందిన 10 లక్షల మంది తండ్రులను పరిశీలించిన అధ్యయనం ప్రకారం.. పిల్లలు పుట్టిన కొత్తలో తండ్రులు చాలా సంతోషంగా ఉంటారు. కానీ, బిడ్డకు ఏడాది వయసు వచ్చేసరికి వారిలో ఒత్తిడి 30 శాతం పెరుగుతోంది. దీనిని ‘డిలేడ్ ఎఫెక్ట్’ అంటారు. అంటే బాధ్యతలు పెరగడం, ఆర్థిక ఒత్తిడి, నిద్రలేమి వంటివి నెమ్మదిగా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
కేవలం ఆడవారిలోనే కాదు, పిల్లలు పుట్టినప్పుడు మగవారిలో కూడా హార్మోన్ల మార్పులు జరుగుతాయని సైన్స్ చెబుతోంది. తండ్రుల్లో టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ తగ్గడం వల్ల వారు త్వరగా అలసటకు, కోపానికి గురవుతుంటారు. ఒకవేళ భార్యకు మానసిక ఒత్తిడి ఉంటే, అది తండ్రిపై కూడా ప్రభావం చూపి సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.

మగవారు తమ బాధను బయటకు చెప్పుకోకుండా దాచిపెడుతుంటారు (మాస్కింగ్). అందుకే వారిలో డిప్రెషన్ లక్షణాలు వేరుగా ఉంటాయి. ఎక్కువగా చిరాకు పడటం, అందరితో కలవకుండా ఒంటరిగా ఉండటం, తలనొప్పి, జీర్ణ సమస్యలు వంటివి కనిపిస్తాయి. తన సమస్య కంటే భార్య ఆరోగ్యమే ముఖ్యం అని భావించి చికిత్స తీసుకోకపోవడం వల్ల ఇది దీర్ఘకాలిక సమస్యగా మారుతోంది.
గణాంకాల ప్రకారం, ప్రతి 10 మంది కొత్త తండ్రుల్లో ఒకరు ఈ ‘పోస్ట్పార్టమ్ డిప్రెషన్ ఇన్ మేన్ (PPND)’ బారిన పడుతున్నారు. ఇది మామూలు అలసట కాదు, వైద్యుల సలహా అవసరమైన పరిస్థితి. కుటుంబ సభ్యులు తండ్రి ప్రవర్తనలోని మార్పులను గమనించి, వారికి అండగా నిలవడం చాలా ముఖ్యం.
తల్లి ఎంత ముఖ్యమో, తండ్రి మానసిక ఆరోగ్యం కూడా కుటుంబానికి అంతకంటే ముఖ్యం. బిడ్డను పెంచే క్రమంలో తండ్రులు పడే ఒత్తిడిని గుర్తించి, వారితో మాట్లాడటం, అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవడం వల్ల సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మించుకోవచ్చు. ఆరోగ్యం అంటే కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, మానసికమైనది కూడా!
