ఆంధ్రప్రదేశ్లో స్కూలుకు వెళ్లే పిల్లల తల్లులకు కూటమి ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. గతంలోని ‘అమ్మఒడి’ స్థానంలో తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ‘తల్లికి వందనం’ పథకం రెండో ఏడాది నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. లబ్ధిదారుల ఖాతాల్లో ఎప్పుడెప్పుడు డబ్బులు పడతాయా అని ఎదురుచూస్తున్న తల్లులకు ఈ అప్డేట్ ఎంతో ఉపశమనాన్ని ఇస్తోంది. అయితే, ఈ పథకం కింద నగదు అందుకోవడానికి ప్రభుత్వం కొన్ని కఠినమైన రూల్స్ పెట్టింది. ఆ వివరాలు, అర్హతలు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం.
జూన్ 12న ఖాతాల్లోకి నిధులు: ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఏడాది జూన్ 12వ తేదీన అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ‘తల్లికి వందనం’ పథకం డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. ఇక ఈసారి ప్రతి లబ్ధిదారురాలికి రూ.13,000 చొప్పున ఆర్థిక సహాయం అందబోతోందని తెలుస్తోంది.
జోరుగా సాగుతున్న వెరిఫికేషన్: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 లక్షల మంది విద్యార్థుల వివరాలను విద్యాశాఖ ఇప్పటికే సేకరించింది. ఈ డేటాను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫై చేస్తున్నారు. ఇక ఈ తనిఖీలు మరో రెండు మూడు వారాల్లో పూర్తి కానున్నాయి. ఆ తర్వాతే ప్రభుత్వం పక్కాగా అర్హులైన వారి ఫైనల్ లిస్ట్ను రిలీజ్ చేస్తుంది.

లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు ఇవే: ఈ పథకం కింద డబ్బులు రావాలంటే కొన్ని ముఖ్యం నిబంధనలు ఉన్నాయి. లబ్ధిదారులకు కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, అలాగే ఆదాయ పన్ను (ఐటీ) చెల్లించేవారు కాకూడదు. పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలం 1000 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలి.
భూమి, కరెంట్ వాడకంపై రూల్స్: వ్యవసాయ భూమి విషయానికి వస్తే.. మాగాణి అయితే 3 ఎకరాల లోపు, ఒకవేళ మెట్ట భూమి అయితే 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. అలాగే, మీ ఇంటి నెలవారీ విద్యుత్ వినియోగం కచ్చితంగా 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. ఈ రూల్స్ అన్నీ పాటిస్తేనే పథకానికి అర్హులుగా గుర్తిస్తారు.
కూటమి ప్రభుత్వం విద్యార్థుల చదువుల కోసం అందిస్తున్న ఈ సాయం ఎంతోమంది పేద కుటుంబాలకు ఆసరాగా నిలవనుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి, పైన చెప్పిన రూల్స్ అన్నీ సరిచూసుకుని లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
గమనిక: లబ్ధిదారులు తమ గుర్తింపు కార్డుకు (ఆధార్ కార్డు) బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉందో లేదో, అలాగే ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తయిందో లేదో ముందే చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల లాస్ట్ మినిట్లో సాంకేతిక ఇబ్బందులు రాకుండా డబ్బులు నేరుగా మీ అకౌంట్కు చేరతాయి.
