కూరగాయలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ, వాటిని వండే పద్ధతి సరిగ్గా లేకపోతే వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు పూర్తిగా నశించిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉండటానికి తినే ఆహారం, తప్పుడు వంట పద్ధతుల వల్ల కేవలం చప్పిడి ముక్కలుగా మారిపోతుంది. అందుకే కొన్ని రకాల కూరగాయలను వండే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బంగాళాదుంపలు కోసేటప్పుడు ఈ జాగ్రత్తలు: చాలా మంది బంగాళాదుంపల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడికిస్తుంటారు. అలా చేయడం వల్ల వాటిలోని పోషక విలువలు అన్నీ వృథా అయిపోతాయి. ఇక అందుకే బంగాళాదుంపల్ని బాగా కడిగి, మధ్యలోకి చిన్నగా కోసి, పొట్టుతో సహా ఉడికించాలి. దీనివల్ల దుంపల పొట్టులో ఉండే పీచు పదార్థం మరియు ఇతర పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయి.
క్యాబేజీని అతిగా ఉడికించవద్దు: చాలామంది క్యాబేజీని నీళ్లలో బాగా ఉడికించి, ఆ నీటిని పారబోసి కూర చేస్తారు. దీనివల్ల శరీరానికి మేలు చేసే పోషకాలన్నీ నీటితో పాటే పోతాయి. అందుకే క్యాబేజీని తక్కువ నీటితో, తక్కువ సమయం మాత్రమే ఉడికించాలి. ఇక క్యాబేజీని అతిగా ఉడికించినా లేదా ఎక్కువగా వేయించినా అందులోంచి సల్ఫర్ విడుదలై కూర రుచి, వాసన కూడా మారిపోతాయి.

ఉల్లిపాయలను పచ్చిగా తినడమే మేలు: మనం సలాడ్లు, బర్గర్లు, శాండ్విచ్ వంటి వాటిల్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలను వాడుతుంటాం. నిజానికి ఇది చాలా మంచి పద్ధతి. ఇక పచ్చి ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ మన శరీర జీవక్రియ రేటునుపెంచుతుంది. ఉల్లిపాయలను నూనెలో ఎక్కువగా వేయించడం వల్ల ఈ గుణాలన్నీ నశించిపోతాయి, కాబట్టి వీటిని వీలైనంత వరకు పచ్చిగా లేదా తక్కువ వేడిపై వండటం మంచిది.
కూరగాయలను ఫ్రై చేస్తే వచ్చే సమస్యలు: క్యారెట్, బీట్రూట్, బెండకాయ, దొండకాయ వంటి కూరగాయలను నూనెలో ముంచి ‘డీప్ ఫ్రై’ చేయడం వల్ల వాటిలోని విటమిన్ సి, బి-కాంప్లెక్స్ వంటి నీటిలో కరిగే విటమిన్లు పూర్తిగా నశించిపోతాయి. ఇక ఇలా వేపుళ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో క్యాలరీలు, చెడు కొవ్వు పెరిగి బరువు పెరగడం, గ్యాస్, ఎసిడిటీ మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువవుతుంది.
కూరగాయల నుండి పూర్తి పోషకాలు పొందాలంటే వాటిని ఎక్కువగా ఉడికించడం లేదా నూనెలో బాగా వేయించడం మానేయాలి. తక్కువ నూనెతో, మూత పెట్టి, తక్కువ మంటపై వండుకోవడం లేదా ఆవిరిపై ఉడికించుకోవడం ద్వారా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా మన సొంతం చేసుకోవచ్చు.
