శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను ‘పొలాల అమావాస్య’ అని పిలుస్తారు. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన ఈ శక్తివంతమైన అమావాస్య శుక్రవారం రోజున రావడం మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి, అదృష్టం వర్షిస్తుందని విశ్వసిస్తారు. పొలాల అమావాస్య ప్రాముఖ్యత, ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ముహూర్తం & లక్ష్మీ పూజ విశిష్టత: పొలాల అమావాస్య తిథి గురువారం ఉదయం 10.33 గంటలకు ప్రారంభమై, శుక్రవారం ఉదయం 8.56 గంటలకు ముగుస్తుంది. ఇక ఈ పవిత్ర సమయంలో పితృ తర్పణాలు ఇవ్వడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అర్ధరాత్రి నువ్వుల నూనె దీపం: పొలాల అమావాస్య రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం. ఇక ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాకుండా, కుటుంబంపై ఉన్న నరదిష్టి, గ్రహ దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.
దానధర్మాలు & స్తోత్ర పఠనం: ఈ రోజు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకధారా స్తోత్రం పఠించడం అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇక అలాగే పేదవారికి అన్నదానం చేయడం, నల్ల నువ్వులు లేదా నల్లటి వస్త్రాలను దానం చేయడం వల్ల వంశాభివృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి.
అర్ధరాత్రి పూట బయటకు వెళ్లకూడదు: అమావాస్య రోజున నెగెటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అర్ధరాత్రి సమయంలో అనవసరంగా బయట తిరగడం మంచిది కాదు. ఇక ఇంట్లోనే ఉంటూ ఆధ్యాత్మిక చింతనతో పూజలు చేసుకోవడం శ్రేయస్కరం.
ఇక శ్రావణ మాసపు పొలాల అమావాస్య నాడు శ్రద్ధా భక్తులతో లక్ష్మీదేవిని ఆరాధించి, దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం నివాసం ఉండి సంపద, అదృష్టం రెట్టింపు అవుతాయి.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాలు మరియు నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. పరిహారాలు పాటించే ముందు మీ కుటుంబ పురోహితులు లేదా జ్యోతిష్యులను సంప్రదించవచ్చు.
