పొద్దుతిరుగుడు సాగులో వచ్చే చీడలు ఎలా నివారించాలంటే..?

-

వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ పంటల ధర మాత్రం ఇంకా నేలపైనే ఉంది. అయినా రైతులు నిరాశ చెందకుండా ఎప్పటికైనా గిట్టుబాటు ధర రాకపోదా అని సాగు చేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల సాగు అంటే మొదట గుర్తొచ్చేది వేరుశనగ. ఆ తర్వాత అధిక విస్తీర్ణం సాగు చేస్తున్న పంట పొద్దుతిరుగుడు పంట. ఈ పంట అన్ని కాలాల్లో పండుతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో సాగవుతుండటం వల్ల రైతులు ఈ సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే సాగు సులభమే కానీ పొద్దుతిరుగుడు సాగులో గింజ ఏర్పడే అప్పుడు మాత్రం చీడలు, పక్షుల సమస్య తీవ్రంగా ఉంటోంది. ఈ సాగులో ప్రధానంగా ఎదురయ్యే చీడలు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందామా..!

బూడిద తెగులు: తేమ ఎక్కువగా ఉండి వేడి వాతావరణంలో బూడిద తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన బూడిద వంటి పొడితో కప్పి ఉంటాయి.తెగులు ఉద్ధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ, డైనోకాప్ లేదా 2 మి.లీ, హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి.

రసం పీల్చే పురుగులు: మొక్క 5 నుంచి 6 ఆకుల దశ నుంచి రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంది.పురుగులు ఆకులలో రసం పీల్చి మొక్కలు గిడసబారి పోయేలా చేస్తాయి. వీటి నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా, 5 మి.లీ. వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్‌ 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నాటిన 20-30 రోజుల వరకు రసంపీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు

పొగాకు లద్దెపురుగు: పైరు మొదటి దశలో ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం వల్ల ఉద్ధృతిని తగ్గించవచ్చు. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న యెడల నొవాల్యూరాన్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక విషపు ఎరను 5 కి. తౌడు + 1/2 కిలో బెల్లం + 1/2 లీ. మోనోక్రోటోపాస్ లేక క్లోరిపైరిఫాస్ ఉండలుగా తయారుచేసి సాయంత్రం వేళల్లో పొలంలో అక్కడక్కడ వేయాలి.

నెక్రోసిస్ తెగులు: ఈ తెగులు తామర పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల పువ్వులు విచ్చుకోకుండా మెలిక తిరిగి వంకరగా మారుతాయి. వీటి నివారణలో పార్టీనియం కలుపును తీసివేయుట మరియు ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే తెగులును అదుపులో ఉంచవచ్చు.

శనగపచ్చ పురుగు: మొక్కలు పుష్పించే దశలో పురుగు ఎక్కువగా ఆశిస్తుంది . శనగపచ్చ పురుగు లార్వాలు పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగు నివారణకు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు యొక్క ఉద్ధృతిని బట్టి ధయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని సమూలంగా నిర్మూలించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news